తెలంగాణ‌లో దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్టు.. లాంఛ‌నంగా ప్రారంభించిన ప్ర‌ధాని

  • పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం ఎన్టీపీసీ జ‌లాశ‌యంలో ప్రాజెక్టు
  • 600 ఎక‌రాల ప్రాజెక్టు కోసం రూ.423 కోట్ల ఖర్చు
  • 4.5 ల‌క్ష‌ల సోలార్ ప్యానెళ్ల‌తో 40 బ్లాకులుగా ఏర్పాటైన ప్రాజెక్టు
నీటిపై తేలియాడే సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల్లో దేశంలోనే అతి పెద్ద‌దైన ప్రాజెక్టు తెలంగాణ‌లోనే ఆవిష్కృత‌మైంది. ఈ ప్రాజెక్టును ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు తెలంగాణ‌లో ఆవిష్కృతం కావ‌డం సంతోషంగా ఉంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రాజెక్టును ప్ర‌ధాని ప్రారంభించ‌డానికి కాస్తంత ముందుగా ప్రాజెక్టు వివ‌రాల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

ఈ ప్రాజెక్టు పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలోని ఎన్టీపీసీ జ‌లాశ‌యంలో 600 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటైన‌ట్లు కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. 100 మోగావాట్ల సామ‌ర్థ్యంలో రూ.423 కోట్ల‌తో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మేక్ ఇన్ ఇండియా క్రింద దేశంలోనే తయారు చేసిన 4.5 లక్షలకు పైగా సోలార్ ప్యానెళ్లతో 40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుందని ఆయ‌న వివ‌రించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ ను సరఫరా చేయవచ్చని కిష‌న్ రెడ్డి తెలిపారు. 

పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టు వలన సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుంద‌న్న కిష‌న్ రెడ్డి.. ఈ ప్రాజెక్టుల వ‌ల్ల‌ 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నిరోధిస్తుందని వివ‌రించారు. ఇటువంటి పర్యావరణ సహిత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండటం మనందరికీ గర్వకారణని ఆయ‌న పేర్కొన్నారు.

BJP
Prime Minister
Narendra Modi
G. Kishan Reddy
Telangana
Peddapalli District
Ramagundam
NTPC Resorvoir
Solar Power Project

More Telugu News